నాడు కుగ్రామం... నేడు మున్సిపాలిటీ.
మూడు దశాబ్దాల క్రితం మూడు వేల జనాభా కూడా లేని సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రంగా 50 వేల జనాభాతో మున్సిపాలిటీ స్థాయికి ఎదగడం విశేషం. కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, నాగుపల్లి, చెరుకుపల్లి, కొమ్మేపల్లి, బేతుపల్లి గ్రామాల మద్య ఈ పల్లె ఆవిర్భావించటంతో నైజాం పాలకులు దీనిని 'సాత్' పల్లి అని పిలిచేవారు. కాలగమనంలో సతుపల్లిగా రూపాంతరం చెందింది. 1975 లో తాలుకా కేంద్రంగా ఆవిర్భవించింది. 1978లో నియోజకవర్గ కేంద్రమైంది. 2005లో మున్సిపాలిటీగా ఏర్పడింది. వందేళ్ళ చరిత్ర కలిగిన పురాతన గ్రామం వేంసూరు. నైజాం కాలంలో పాలనా కేంద్రంగా, ఆ తరువాత నియోజకవర్గ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ గ్రామం నేడు ప్రాభవాన్ని కోల్పోయింది.
వింతలు... విశేషాలు
- సత్తుపల్లి మండలం తుమ్మూరు గ్రామానికి వెయ్యేళ్ళకు పైబడిన చరిత్ర ఉంది. వెయ్యేళ్ళ క్రితం రెడ్డిరాజులు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయం కోటగోడ, కాకతీయులు నిర్మించిన శివాలయం ఇప్పటికీ ఉన్నాయి.
- పెనుబల్లి మండలంలోని నీలాద్రి కొండల్లో కాకతీయులు శివాలయాన్ని నిర్మంచారు.
- వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ఓ భక్తుడు 500 ఏళ్ళక్రితం నిర్మించిన వెంకటేశ్వరస్వామి ఆలయం ఇప్పటికీ పూజలందుకుంటోంది.
- వేంసూరు, కల్లూరులో నైజం సర్కారు వందేళ్ళ క్రితం నిర్మించిన పొలీసు స్టేషన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
- సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్న తల్లాడ మండలానికి కరువంటే తెలియదు.
- పెనుబల్లి మండలంలోని లంకసాగర్ ప్రాజెక్టు నియోజకవర్గంలో పెద్ద జలాశయం.
- కల్లూరు మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 66 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారు.
- గంగారంలో నెలకొల్పిన 15 వ గిరిజన బెటాలియన్ లో 1200 మంది సిబ్బంది ఉన్నారు.
- 60 వేల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగవుతున్నాయి.